దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత... అకోలాలో 46.9 డిగ్రీలు నమోదు

  • నాగ్‌పూర్, విదర్భలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు
  • దేశంలోని అన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచన
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగ్‌పూర్, విదర్భలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచాయి. ఈ సంవత్సరం మార్చి నెల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటాయి. దీనితో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.

ఈ వారం మొత్తం దేశంలోని అనేక ప్రాంతాల్లో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నాగ్‌పూర్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సంవత్సరం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 నుంచి 46 డిగ్రీల వరకు చేరుకోవచ్చని, కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం దేశంలోనే అత్యధికంగా అకోలాలో 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. అమరావతి (మహారాష్ట్ర)లో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.

వాతావరణ శాఖ డేటా ప్రకారం, వార్దాలో 46.4 డిగ్రీలు, యవత్మాల్‌లో 46 డిగ్రీలు, నాగ్‌పూర్‌లో 45.4 డిగ్రీలు, చంద్రాపూర్‌లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విదర్భ ప్రాంతంలో తీవ్రమైన వడగాలులు వీచాయని తెలిపింది. ఈ ప్రాంతంలో మంగళవారం వరకు ఈ వడగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు రాకూడదని అధికారులు సూచించారు.

Akola hottest in India at 46.9 deg C

More Telugu News